Asankhya banner

సొగసరి చిటుకున కనుమరు గయ్యెన్

telugu
archive
పద్యాలు
దాదాపు పది సంవత్సరాలు పాటు విజయనగరం - విజయవాడ -చెన్నయ్ - బెంగుళూరు రైలుమార్గం లో చదువు/ఉద్యోగరీత్యా శెలవులకీ, గట్రా తిరగడం మూలాన, ఆ ప్రయాణాల్లొ ఎన్నో అనుభవాలు ఎదురయ్యేవి.
Author

Soma S Dhavala

Published

August 6, 2010

దాదాపు పది సంవత్సరాలు పాటు
విజయనగరం - విజయవాడ -చెన్నయ్ - బెంగుళూరు
రైలుమార్గం లో చదువు/ఉద్యోగరీత్యా శెలవులకీ, గట్రా తిరగడం మూలాన, ఆ ప్రయాణాల్లొ ఎన్నో అనుభవాలు ఎదురయ్యేవి.
అది విశాఖపట్నం ఒకటో, అయిదో ప్లాట్ ఫాం. రత్నాచల్ కోసం కాబోలు నిరీక్షుస్తున్నా, బల్లమీద కూర్చుని. ఇంతలో ఇంకేదో రైలు వచ్చి ఆగింది, ఒక పెట్టె తలుపులోంచి అవతలి ప్లాట్ ఫాం కనిపంచే విధంగా. ఏదో పరధ్యానంగా, ప్రపంచాన్ని పట్టించుకోకుండా ఉన్న నన్ను ఈ లోకంలోకి లాక్కొచ్చింది, అప్పుడే యవ్వనంలోకి అడుగుపెడుతున్న యువతి.
కం||
అరవిరిసిన విరిబోణి స
వరించె ముంగురుల. మధుర భావనఁ రేగన్ఁ
పరవశి మరల్చె జగముల్.
అరయగ, సొగసరి చిటుకున కనుమరుగయ్యెన్!
రైలు ఆగంగానే, అలా, వాష్ బేసిన్ దగ్గర ఉండే అద్దంలో తనను తాను చూసుకొని మైమరచిపోతోంది. అటు తిరిగి ఓమారు సర్దుకొని, మళ్ళీ ఇటుతిరిగి. అలా ఒక అయిదునిముషాలు గడిచాక, ఈ లోకంలోకి వచ్చి తన్ను చూస్తున్న నన్ను చూసి, ఛప్పున సిగ్గుతో రైలుపెట్టెలోకి పారిపోయింది. ఈ పద్యం (ఎవరో) ఆ అమ్మాయికి అంకితం.